కరోనా ఎఫెక్ట్ ఉండటంతో ఇంటి నుంచి పనిచేస్తామని కోరిన ఏపీ సచివాలయ ఉద్యోగులు.
షిఫ్ట్ ప్రకారం పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే.. అలాగే వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం.
కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలోనూ కొన్ని చర్యలు తీసుకుంటోంది.
అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో తమకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు.
వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించింది.
ఈ మేరకు ఉద్యోగుల కోసం షిఫ్ట్లవారీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా ప్లాన్ చేసింది.
ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్వోడీలు సోమవారం నుంచి రెండు బ్యాచ్లుగా విడిపోయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఒక బ్యాచ్ ఇంటి నుంచి పనిచేస్తే.. మరో బ్యాచ్ సచివాలయ కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తారు. ఇలా వారానికికో బ్యాచ్ విడతల వారీగా పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇటు సచివాలయం లోపలికి ఉద్యోగులు మినహా ఎవర్నీ అనుమతించడం లేదు.
మరోవైపు రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పించింది ప్రభుత్వం.
మంత్రి గౌతమ్ రెడ్డి టెలికాం, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు మంత్రి.
ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా 24 గంటల ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు.
సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ టెలికాం సేవలు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వారి ప్లాన్లకు అనుగుణంగా ఇంటర్నెట్, టెలికమ్ సేవలను తప్పనిసరిగా అందించేలా చూడాలన్నారు.
క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.