ఇంగ్లిష్’ మీడియంపై కొత్త ‘జీవో’ విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలోని అన్ని ప్రభుత్వ, మండల, జడ్పీ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 -6 తరగతులకు ప్రవేశపెట్టనున్నారు.
గతంలో విడుదల చేసిన జీవీలో మార్పులు చేస్తూ.. కొత్త జీవో విడుదల
1 – 6వ తరగతులకే ఇంగ్లిష్ మీడియం వర్తింపు
ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం బుధవారం (నవంబరు 20) జీవో జారీ చేసింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ జీవో వర్తించనుంది.
దీని ప్రకారం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనకు సరైన వనరులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు అన్ని తరగతులకు తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్ట్ను కచ్చితంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంగ్లిష్ బోధనలో ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం సూచించింది. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు కోసం టీచర్ల నియామకాలు, శిక్షణ చేపట్టే బాధ్యతను విద్యాశాఖకు అప్పగించిన ప్రభుత్వం..
ఇంగ్లిష్లో బోధించేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన గైడెన్స్ ఇవ్వాలని, పాఠ్యాంశాలకు సంబంధించి కొత్త సిలబస్ను సిద్ధం చేయాలని SCERT’ని ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నవంబరు 6న అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే తొలిదశలో 1 నుంచి 8వ తరగతి వరకు అమలు చేయాలని మొదట భావించినప్పటికీ.. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు నవంబరు 20న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
దీనిప్రకారం వచ్చే ఏడాది నుంచి 1 – 6వ తరగతి వరకు.. ఆ తర్వాత ప్రతీ ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంచుతూ 10వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్నారు.
మార్గదర్శకాలు ఇలా . . . ➦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ-విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. ➦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1 – 6 తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి. ➦ ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే.. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవుల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయి. ➦ టీచర్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ➦ ఇంగ్లిష్ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. ➦ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్లను.. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి. ➦ విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండాలి. ➦ సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి వీలుగా.. వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్ను రూపొందించే బాధ్యతను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ)కి అప్పగించింది.