Applications-appointment-volunteers-from-July 8-2019-recruitment
జూలై 8 నుంచి వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలు కాబోతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దాదాపు 4 లక్షల మంది వలంటీర్ల నియామకానికి జులై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించిన విషయం తెలిసిందే.
ఈ నియామకానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్తో సంప్రదింపులు జరుపుతోంది. రెండు మూడు రోజుల్లో న్యాయపరమైన అడ్డంకులు తొలగించుకొని, వలంటీర్ల నియామకాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తోంది.
ఆగస్టు 7 నాటికి నియామక ప్రక్రియ పూర్తి :
గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల నియామకానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు.
దీనిపై జూన్ 30వ తేదీ వరకు విసృ్తత ప్రచారం కల్పిస్తారు.
జూలై 8వ తేదీ నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు పెట్టి..
పది రోజుల పాటు అంటే జూలై 18వ తేదీ వరకు స్వీకరిస్తారు.
ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
జూలై 23వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.
మెరిట్ అభ్యర్థులకు
జూలై 30వ తేదీ నుంచి మండల స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించి,
ఆగస్టు 7వ తేదీ నాటికి వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఎంపికై న అభ్యర్థులకు మండల స్థాయిలోనే ఆగస్టు 10వ తేదీ తర్వాత రెండు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్లు అధికారికంగా విధుల్లో చేరేలా ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు. కాగా, దీనిపై పూర్తిస్థాయి విధివిధానాలతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది.
ఏ గ్రామంలో ఎంతమంది?
రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎంతమంది వలంటీర్లను నియమించాలన్నది ఆ గ్రామాల్లో కుటుంబాల సంఖ్యపై- ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న కుటుంబాలను 50 చొప్పున వర్గీకరించి, అక్కడ ఎంతమంది వలంటీర్లను నియమించాలన్నది నిర్ణయిస్తారు.
జిల్లాల వారీగా ఇళ్ల గణాంకాలను తెప్పించుకొని, జులై 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడతారని పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.