ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యా అభ్యసించాలనుకునే పేద విద్యార్థులు రుణ సదుపాయం పొందేందుకు వీలుగా భారత వైద్యమండలి (ఎంసీఐ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
దేశంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ‘ఎంబీబీఎస్’ విద్యను చదవాలనుకునే పేద విద్యార్థులపై ఇకపై ఆర్థిక భారం తగ్గనుంది.
ఈ మేరకు వారు బ్యాంకు రుణాలు పొందేందుకు వీలుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) కార్యచరణ సిద్ధం చేస్తోంది.
బ్యాంకు రుణాలకు సంబంధించి ఎంసీఐ చేసిన విజ్ఞాపనను బ్యాంకర్లు అంగీకరించారు.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రైవేటు వైద్య కళాశాల్లో ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షల ఫీజును చదువుకునే విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి.
దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అటు ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరక్క.. ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు చెల్లించి చదవలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారిక ఆర్థిక భరోసా దక్కనుంది.
ఎంసీఐ చొరవ.. ఇటీవల బ్యాంకుల అధికారులతో జరిగిన సమావేశంలో విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించాల్సిందిగా ఎంసీఐ బోర్డు గవర్నర్లు కోరారు.
మొదట ఈ వినతిపై బ్యాంకు అధికారులు అభ్యంతరం తెలిపారు.
ఎంబీబీఎస్ విద్య పూర్తిచేసిన తర్వాత విద్యార్థుల సంపాదన ప్రారంభంలో తక్కువగా ఉంటుందని.. వాయిదాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందన్నారు.
అయితే విద్యార్థుల రుణాల వసూళ్లకు భరోసాగా ఉంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. చివరకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి అంగీకరించారు.