నూతన విద్యావిధానం, కొత్త పాఠ్యప్రణాళికలు, నూతన విద్యా సంస్కరణలు, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం… వెరసి కొంగ్రొత్త ఆశలతో నూతన విద్యాసంవత్సరం బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలల తలుపులు తెరచుకుంటున్నాయి. విద్యాసంస్థల ప్రాంగణాలు కొంగ్రొత్త శోభతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి.
పాఠ్యపుస్తకాల పంపిణీ ఇప్పటికే పూర్తికాగా, వాటిని విద్యార్ధులకు స్కూలు తెరిచిన తొలిరోజునే ఇచ్చేందుకు ప్రధానోపాధ్యాయులు, విద్యాధికారులు సిద్ధమయ్యారు.
కార్పొరేట్ పాఠశాలల విద్యార్ధుల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నారు.
కీలకమైన కంప్యూటర్ విద్యాబోధనకు డిజిటల్ క్లాస్రూమ్లు, వర్చువల్ క్లాస్రూమ్లను విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కార్యాచరణను రూపొందించారు.
బుధవారం నుంచి స్కూల్ ప్రారంభం
అమ్మఒడి’ తో బడిబాటకు ఊతం
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బాలబాలికలు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వీరుకాక బడికి వెళ్లని పిల్లలు, బడి మానేసిన పిల్లలు ఉన్నట్లు గత ఏడాది గుర్తించారు.
నూతన ప్రభుత్వ విధానం ప్రకారం విద్యార్ధులంతా బడికి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నారు.
ఆ మేరకు నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే విద్యార్థుల కోసం ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రకటించింది.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కార్యచరణకు స్పష్టత ఇచ్చారు.
జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
ఆ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం కింద ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.
పిల్లలను బడికి పంపినందుకు గాను తల్లిదండ్రుల/ విద్యార్థి బ్యాంకు ఖాతాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఇస్తామని సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన విషయం విధితమే.
ఈ పథకం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
నో బ్యాగ్ డే
హ్యాపీ కరికులం పథకానికి నూతన విద్యాసంవత్సరంలో శ్రీకారం చుడుతున్నారు.
ఈ పథకం ప్రకారం ప్రతి శనివారం ప్రాఽథమిక స్థాయి విద్యార్థులు పాఠశాలలకు పుస్తకాల సంచి లేకుండా రావచ్చు. దీనివల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. శనివారాల్లో పాఠ్యాం శాల బోధనకు బదులుగా ఆటపాటలతో విద్యార్థులు గడిపేందుకు అవకాశం ఉంటుంది. నూతన విద్యావిధానంలో నో బ్యాగ్ డే కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.
అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడు వేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో ఫీజుల రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఫీజుల వసూళ్లపై నియంత్రణ లేని ప్రైవేటు పాఠశాలలకు వర్తించేలా ఈ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు నిర్ణయాలు ఉంటాయి.
ఫీజుల నియంత్రిచడంతో పాటే అకడమిక్ క్యాలెండర్ను పూర్తిస్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు కూడా పాటించేలా షరతులు విధించనున్నారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకునేలా నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి సిద్ధమవుతోంది.
రేపటి నుంచే బడిబాట
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు, విద్యార్ధుల అడ్మిషన్లను పెంచుకునేందుకు బుధవారం నుంచి ఈ నెల 19 వరకు ‘ రాజన్న బడిబాట – బడి పిలుస్తోంది – విద్యా వారోత్సవాలు నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే రోజువారీ కార్యచరణ ప్రకటించారు.
పాఠశాలలు వారీగా విద్యార్థులు తల్లిదండ్రులు, టీచర్లతో పీటే సమావేశాలను నిర్వహించి నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి వివరించనున్నారు.
అలాగే స్థానిక గ్రామపెద్దలు, ఎన్జీవోలు, స్కూలు మేనేజ్మెంట్ కమిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు చేరికకు క్షేత్రస్థాయి కార్యచరణకు జిల్లా విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ఆర్ అక్షయప్రాత బడి భోజనం (బాక్స్ )
పాఠశాలలకు మధ్యాహ్నభోజన పథకాన్ని వర్తింపచేస్తుండగా, ఈ ఏడాది కొత్తగా ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నేతృత్వంలోని హరేరామ హరేకృష్ణ – అక్షయపాత్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజన పథకాన్ని ప్రారంభించనున్నారు.
కాగా కొత్త ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనపథకం కార్మికులకు (కుక్ కమ్ హెల్పర్లు) నెలవారీ ఇచ్చే గౌరవ వేతనాన్ని నెలకు రూ.3 వేలకు పెంచుతూ తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ విద్యాసంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో అమలు కానుంది.
జిల్లాలో 6284 మంది కుక్ కమ్ హెల్పర్లు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు.