ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లల్లో సైన్స్లో పీజీ చేసే అవకాశాన్ని జామ్ పరీక్ష కల్పిస్తోంది. ఆసక్తి ఉన్న విభాగాల్లో అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోడానికి ఇదో మంచి వేదిక. డీఆర్డీఓ, ఇస్రో వంటి ఉన్నతస్థాయి సంస్థలు, ప్రభుత్వ నిధులతో నడిచే రిసెర్చ్ ఆర్గనైజేషన్లు ఈ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టు ఎమ్మెస్సీ (జామ్-2020) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఐఐటీలతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ),
బెంగళూరులో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ;
ఎన్ఐటీల్లో ఎమ్మెస్సీ,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, షిబ్పూర్;
సంత్ లౌంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పంజాబ్;
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది.
ఇవీ సబ్జెక్టులు పరీక్షను ఆరు సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు.
అవి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్. అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు.
సెషన్-1లో ఒకటి,
సెషన్-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్-1లో ఉదయం బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.
రెండో సెషన్లో మధ్యాహ్నం కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి.
ఎమ్మెస్సీ, జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ, ఎమ్మెస్సీ-ఎంఎస్(రిసెర్చ్)/పీహెచ్డీ కోర్సుల్లో 20 ఐఐటీలతోపాటు, ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది
అర్హత:
ఆయా సంస్థలవారీ అర్హతల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. సాధారణంగా ఐఐటీల్లో ప్రవేశం కోరేవారు డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం సరిపోతుంది. అదే ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రవేశాలకు 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతంగా నిర్ణయించారు. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సుకు సైన్స్ గ్రాడ్యుయేట్లతోపాటు అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐటీలు, ఐఐఎస్సీలో కెమిస్ట్రీ కోర్సులకు డిగ్రీలో కెమిస్ట్రీతోపాటు ఇంటర్లో మ్యాథ్స్ తప్పనిసరిగా చదివుండాలి.
ఎన్ఐటీల్లో ప్రవేశాలకు మాత్రం డిగ్రీలో కెమిస్ట్రీ చదివినవాళ్లంతా అర్హులే.
మ్యాథ్స్, ఫిజిక్స్ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి.
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ఐఐటీ- బాంబే, రూర్కీ, ఇండోర్ ఈ 3 సంస్థలే అందిస్తున్నాయి.
పరీక్ష విధానం పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది.
ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటికి వంద మార్కులు. మూడు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు.
అవి.. మల్టిపుల్ ఛాయిస్, మల్టిపుల్ సెలెక్ట్, న్యూమరికల్ సమాధాన ప్రశ్నలు. వీటిని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్-ఎ:
ఇందులో మొత్తం 30 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి.
వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది.
రుణాత్మక మార్కులు ఉన్నాయి.
తప్పు సమాధానాలకు ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు. సెక్షన్-బి:
ఇందులో పది మల్టిపుల్ సెలక్ట్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉండవచ్చు.
సరైన ఆప్షన్/ ఆప్షన్లను గుర్తిస్తేనే పూర్తి మార్కులు వస్తాయి. పాక్షిక సమాధానానికి మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు. సెక్షన్-సి:
ఇందులో 20 న్యూమరికల్ ఆన్సర్ ప్రశ్నలు ఇస్తారు. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది.
ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు.
ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.
ఆన్లైన్ దరఖాస్తులు:సెప్టెంబరు 5 నుంచి స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు:
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750 రెండు పేపర్లకు రూ.1050. మిగిలిన అభ్యర్థులు అందరికీ రూ.1500. రెండు పేపర్లకు రూ.2100 చివరి తేదీ: అక్టోబరు 8 పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్. ఫలితాలు: మార్చి 20న ప్రకటిస్తారు.