New-schemes-in-Andhra-Pradesh-different-cards-issue-2019
అందరికీ సంక్షేమం వైఎస్సార్ నవశకం
ప్రతి పథకానికి వేర్వేరు కార్డుల జారీ
గ్రామాల్లో నెలకు రూ.10 వేలు..
పట్టణాల్లో రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ బియ్యం, పెన్షన్ కార్డులు
ఏడాదికి రూ.2.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఫీజు రీయింబర్స్మెంట్
90 శాతం ప్రజలకు ఏదో ఒక పథకంతో లబ్ధి
పార్టీ, మతం, కులం,ప్రాంతాలకు అతీతంగా సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక
ఈ నెల 20 నుంచి వలంటీర్లతో ఇంటింటా సర్వే
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లు చెల్లింపు
సొంత షాపులున్న బీపీఎల్ రజకులు,నాయీ బ్రాహ్మణులు,టైలర్లకు ఏటా రూ.10 వేలు
గ్రామాల్లో రూ.10 వేలు,పట్టణాల్లో రూ.12 వేల ఆదాయం ఉన్న వారందరికీ వైఎస్సార్ కాపు నేస్తం
సబ్సిడీ బియ్యం, పెన్షన్లు పొందేందుకు ఆదాయ పరిమితిని భారీగా పెంచారు. ప్రస్తుతం రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం రూ.75 వేలు, పట్టణాల్లో రూ.లక్ష వరకే పరిమితి ఉండేది.
దీనిని భారీగా పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం కల్పించనున్నారు.
ప్రస్తుతం ఏ పథకానికైనా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ఉంది.
ఇక దాంతో సంబంధం లేకుండా ప్రతి పథకానికి వేర్వేరు కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఈ నెల 20 నుంచి 30వ తేదీలోగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి లబ్దిదారుల్ని ఎంపిక చేస్తారు.
గ్రామాల్లో రోజుకు ఐదు ఇళ్లు, పట్టణాల్లో రోజుకు పది ఇళ్లను మాత్రమే సర్వే చేస్తారు.
ఎంపిక పూర్తయ్యాక లబ్దిదారుల ముసాయిదా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతారు.
సామాజిక తనిఖీ కోసం ఐదు రోజుల గడువు ఇస్తారు.
ఆయా గ్రామ, వార్డు పరిధిలోని ప్రజలు ఆ జాబితాలను పరిశీలించి
అభ్యంతరాలు, మార్పులు, చేర్పులను సూచిస్తారు.
సామాజిక తనిఖీలోని అంశాల వాస్తవికత ఆధారంగా లబ్దిదారుల తుది జాబితాలను రూపొందించి గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందుతారు.
గ్రామ సభలను ఎంపీడీవోలు, వార్డు సభలను మున్సిపల్ కమిషనర్లు నిర్వహిస్తారు. వీటిలో ఆమోదించిన తుది జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు.
ఆయా పథకాలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి నేడో, రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
బియ్యం, పెన్షన్ కార్డులు పొందేందుకు అర్హతలు
– బియ్యం కార్డు, పెన్షన్ కార్డు పొందగోరే గ్రామీణులైతే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో వారైతే నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారంతా అర్హులు
– కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి.. లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు
– నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు, పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు లేదా అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారు కూడా అర్హులే.
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులు మినహా) అనర్హులు.
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) గలవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు.
జగనన్న విద్యాదీవెన.. వసతి దీవెన
– జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు ఇచ్చేందుకు విడివిడిగా కార్డులను జారీ చేయనున్నారు.
– వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల్లోపు గల కుటుంబాలు అర్హులు.
– 10 ఎకరాల్లోపు మాగాణి, 25 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిసి 25 ఎకరాల్లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో 1,500లోపు చదరపు అడుగుల సొంత భవనం ఉన్నవారూ అర్హులే
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు) అనర్హులు
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ మినహాయింపు) ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు
డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లు
డ్వాక్రా అక్క, చెల్లెమ్మలకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు వైఎస్సార్ నవశకం సున్నా వడ్డీ కింద రూ.2,400 కోట్లను చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మొత్తంలో రూ.1,200 కోట్లను డిసెంబర్ నెలలో వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ నవశకం కాపు నేస్తం కింద 45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధి కోసం ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చేందుకు విధి, విధానాలను ఖరారు చేశారు.
– గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు
– కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు
– పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులు, అంత కన్నా తక్కువ విస్తీర్ణంలో భవనం ఉన్నవారూ అర్హులే
– ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు
– నాలుగు చక్రాల వాహనం (టాక్సీ, అటో, ట్రాక్టర్ ఉంటే మినహాయింపు) ఉన్నవారు అనర్హులు.
– ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు అనర్హులు.
– రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10 వేలు
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి సొంత షాపు గల రజకులు, నాయీ బ్రాహ్మణలు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
అందరికీ ఆరోగ్యశ్రీ – రాష్ట్రంలో 95 శాతానికి పైగా ప్రజలకు వర్తింపు
One comment
Pingback: Expansion-of-YSR-Aarogyasri-guidelines-eligibility criteria-Health Cards