SOUTH-KOREA-Corona-test-in-just-7-minutes-No-lock-down-technology-won-carona

SOUTH-KOREA-Corona-test-in-just-7-minutes-No-lock-down-technology-won-carona

దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!

ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా.. 13 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సరిహద్దులను మూసివేసి.. ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. భారత్‌లోనూ జనతా కర్ఫ్యూ పేరిట రోజంతా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలు తమకు తోచిన అన్ని విధానాలను అనుసరిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టిన చైనాలోనే ఇప్పటి వరకూ అత్యధిక కేసులు నమోదు కాగా.. ఇటలీలో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. కానీ చైనా వెలుపల కరోనా విజృంభించిన తొలి దేశం మాత్రం దాని పొరుగున ఉన్న దక్షిణ కొరియా.

ఒకప్పుడు కొరియాలో కరోనా వ్యాప్తి చెందిన తీరు చూసి.. మరో చైనా అవుతుందని భావించారు. దక్షిణ కొరియాలో దాదాపు 9 వేల మందికి కోవిడ్ సోకగా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు.

కానీ కొద్ది రోజుల్లోనే ఆ దేశం కోవిడ్‌ వ్యాప్తిని అదుపు చేసింది..

ఇప్పుడు ఆ దేశం దాదాపుగా సాధారణ స్థితికి చేరుకుంది.

కరోనా కట్టడి కోసం కొరియా తీసుకున్న చర్యలే దీనికి కారణం. 

ముందే అప్రమత్తమైన కొరియా

కరోనాపై పోరాటం కోసం కొరియా పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు క్వారంటైన్‌లో ఉంచింది.

కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు.

కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి.

కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది. టెస్టింగ్ సెంటర్లతోపాటు హాస్పిటళ్లలో ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

ఓ ప్రదేశంలో కరోనా కేసులు నమోదైతే.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపి.. అటు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కనీసం 15 కొరియా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి.

యాప్‌తో పర్యవేక్షణ

క్వారంటైన్లో ఉండే వారు బయటకు రాకుండా చూడటం కోసం జీపీఎస్ ఆధారిత యాప్‌ను రూపొందించింది.

ఒకవేళ వారు గడప దాటితే అలారం మోగేలా ఏర్పాట్లు చేశారు. ఆ దేశంలోకి వెళ్లే పర్యాటకులు యాప్ ద్వారా లక్షణాలను రికార్డ్ చేయాలని కోరారు.

అన్ని దేశాలూ లాక్ డౌన్ విధానం ద్వారా, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుంటే.. కొరియా మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ విధాన్ని ప్రారంభించింది.

దీనికి దక్షిణ కొరియా అధ్యక్షుడే ప్రాచుర్యం కల్పించారు. 

కొంపముంచిన చర్చి వేడుకలు..

ఫిబ్రవరి 18న దక్షిణ కొరియాలో 31వ కోవిడ్ పేషెంట్‌ను గుర్తించారు.

ఆమె వల్ల కొరియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందింది. షిన్‌చెయోన్జీ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె వల్ల డైగూ నగరంలో చాలా మందికి కరోనా సోకింది.

చర్చి సభ్యుల ద్వారా కరోనా కేసులు దేశం మొత్తం విస్తరించాయి.

ఫలితంగా రెండు వారాల వ్యవధిలోనే కొరియాలో కరోనా కేసుల సంఖ్య 180 రెట్లు పెరిగింది.

ఓ దశలో ఒక్క రోజులో కొరియాలో కొత్తగా 900 కరోనా కేసులను గుర్తించారు.

దీంతో చైనా తర్వాత కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశంగా కొరియా అవతరించింది.

పక్కా ప్రణాళికతో దిగి వచ్చిన కేసులు

కానీ కొద్ది వ్యవధిలోనే కరోనా వేగానికి కొరియా కళ్లెం వేయగలిగింది.

ఒక్క రోజులో గరిష్టంగా 900 కేసులు నమోదైన స్థితి నుంచి 100 లోపు కేసులు నమోదయ్యే స్థితికి కొరియా చేరుకుంది. కొరియాలో దాదాపు 9 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా.. వాటిలో మూడొంతుల కేసులు డైగూ నగరంలోనే నమోదయ్యాయి.

అంటే చైనాలో వుహాన్ ఎలా కరోనా కేంద్ర స్థానంగా మారిందో కొరియాలో డైగూ సిటీ అలా మారింది. చైనా వుహాన్ నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేయగా.. కొరియా మాత్రం ఇందుకు భిన్న పంథాను అనుసరించింది.

తమకు తెలియకుండానే కరోనాను వ్యాప్తి చేస్తున్నారు అనుకున్న వారందర్నీ పరీక్షించింది. ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకుంది. ఇందుకోసం పోలీసులు, మిలిటరీ సాయం తీసుకుంది.

మరో వుహాన్‌లా మారిన డైగూ

కరోనా కట్టడి కోసం చైనా ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అనుసరించింది.

కానీ ప్రజాస్వామ్య దేశం, అందులోనూ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కొరియాలో అది సాధ్యం కాలేదు.

కొరియాలో కోవిడ్ కేసులు ఎక్కువగా డైగూలో నమోదైతే.. తర్వాతి స్థానంలో పొరుగున ఉన్న నార్త్ గయాన్‌సాంగ్ ప్రావిన్స్ ఉంది. ఈ రెండు చోట్ల భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడానికి పైన పేర్కొనట్లు ఓ చర్చిలో జరిగిన ఈవెంట్ కారణం.

ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో.. డైగూ నగరంలోనూ ప్రయాణాలపై ఆంక్షలు విధించలేదు.

చైనాకు భిన్నంగా

కరోనా కట్టడి కోసం చైనా ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలను వారి ఇళ్లలోనే ఖైదీలుగా మార్చేసింది. దీంతో అక్కడ కరోనా అదుపులోకి వచ్చింది. కానీ కొరియా, ఇటలీల్లో మాత్రం కేసుల సంఖ్య పెరిగింది.

వుహాన్‌లో లాక్ డౌన్ ప్రకటించడానికి ముందే దాదాపు 50 లక్షల మంది ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోయారు.

ఆంక్షల కారణంగా హుబేయ్ ప్రావిన్స్‌లో చాలా మంది ఉపాధి కోల్పోయారు.

ఇలాంటి ఆంక్షలు కొరియాలో సాధ్యం కాదు కాబట్టి.. కుదిరితే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని డైగూ మేయర్ అభ్యర్థించారు.

విమాన సర్వీసులను తగ్గించినందుకే జెజూ ఐలాండ్ గవర్నర్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

ఇళ్లలోనే క్వారంటైన్

జపాన్ తరహాలోనే కరోనాను అరికట్టడం నుంచి.. హాస్పిటళ్లలో బెడ్లు, వసతులను మెరుగుపర్చడంపై కొరియా దృష్టి మళ్లించింది. సీరియస్ కేసులకు ప్రభుత్వం వైద్య సాయం అందించగా.. ఓ మాదిరి లక్షణాలతో బాధపడుతున్నవారు తమ ఇళ్లలోనే చికిత్స పొందారు.

కరోనా బారిన పడ్డ వృద్ధులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. వారిని కాపాడటానికి ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో సదుపాయాలు సరిగా లేకపోవడంతో డైగూ నగరంలో 140 మందికిపైగా కరోనా రోగులను ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచారు.
జలుబు చేసినా..

కరోనాపై పోరాటం కోసం కొరియా అధ్యక్షుడు డైగూ నగరానికి వెళ్లారు.

మనమంతా కలిసి కోవిడ్‌పై పోరాడదాం అని పిలుపునిచ్చారు. నగరంలోని పలు హాస్పిటళ్లు, మార్కెట్, సిటీ హాల్‌ను ఆయన సందర్శించారు. మనమంతా కలిసి పోరాడితే సాధించలేనిది ఏం లేదని ఆయన అధికారుల్లో స్ఫూర్తి నింపారు. ప్రభుత్వం, కొరియా ప్రజలు మీకు అండగా ఉంటారని డైగూ, గియాంగ్‌సాంగ్ ప్రజలకు అధ్యక్షుడు భరోసా ఇచ్చారు.

2 లక్షల మందికిపై షిన్‌చెనోజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కొరియా అధికారులు ప్రతిన బూనారు. ఈ చర్చిలో నిర్వహించిన కార్యక్రమం వల్లే కరోనా కేసుల సంఖ్య కొరియాలో భారీగా పెరిగింది. డైగూ నగరంలో జలుబు చేసిన వారికి కూడా కోవిడ్ పరీక్షలు చేశారు.

రోజుకు 20 వేేల మందికి పరీక్షలు

కొరియాలో రోజుకు 20 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం సియోల్ నగరంలోని కొన్ని హాస్పిటళ్లు ఫోన్ బూత్ విధానాన్ని అనుసరించాయి. దీని ప్రకారం ముందుగా అనుమాతుణ్ని ఓ బూత్‌లోకి పంపిస్తారు.

అందులో మొదటగా డాక్టర్ అతణ్ని పరిశీలిస్తారు. అనంతరం అతడి నోరు, ముక్కు నుంచి శాంపిళ్లను సేకరిస్తారు. ఏడు నిమిషాల్లోనే అనుమానితుడికి కరోనా ఉందా లేదా అని తేల్చేస్తారు. ఒకరికి టెస్ట్ ముగియగానే..

ఆ బూత్‌ను క్లీన్ చేస్తారు. ఈ విధానంలో రోజుకు 70-80 శాంపిళ్లను పరీక్షించగలిగారు. ఇలా కొరియా తీసుకున్న అనేక చర్యల ఫలితంగా అక్కడ కరోనా వ్యాప్తి తగ్గింది.

లాక్ డౌన్ అంటే ఏంటి? ప్రజలు చేయదగినవి.. చేయకూడని పనులివే…

ఇంట్లోనే ఈజీగా శానిటైజర్‌ని తయారు చేయండిలా..

error: Content is protected !!