Coronavirus Effect: కస్టమర్లకు ఎస్బీఐ ముఖ్య గమనిక
కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం తప్పట్లేదు. అందుకే డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి బ్యాంకులు.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీ అకౌంట్కు సంబంధించిన సమస్యల కోసం కస్టమర్ కేర్కు కాల్ చేస్తున్నారా?
అత్యవసరమైతే తప్ప కస్టమర్ కేర్కు కాల్ చేయొద్దని ఎస్బీఐ కోరుతోంది.
కరోనా వైరస్ ప్రభావం కారణంగా సిబ్బంది కొరత ఉందని, చాలామంది ఉద్యోగులు ఇంటికే పరిమితం అయ్యారని, కొంతమందితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఎస్బీఐ వేడుకుంటోంది.
కస్టమర్లు బ్యాంకింగ్ అవసరాల కోసం డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది.
బ్యాంకులో సేవలు అందిస్తున్న సిబ్బంది తక్కువగా ఉండటంతో వారికి పనిభారం ఎక్కువవుతోంది.
అందుకే కస్టమర్లు అత్యవసరమైన పనుల కోసమే సంప్రదించాలన్నది బ్యాంకు ఉద్దేశం.
ఎస్బీఐ మాత్రమే కాదు… హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా కస్టమర్లు డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా బ్యాంకుల్లో సిబ్బంది కొరత ఉంది. తక్కువ మందితోనే బ్యాంకుల్ని నిర్వహిస్తున్నాయి ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ. డిజిటల్ సేవల ద్వారా బ్యాంకుల్లో ఉండే సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని బ్యాంకులు చెబుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు వేళలు మారాయి. మార్చి 31 వరకు శనివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. పాస్బుక్ అప్డేట్, ఫారిన్ కరెన్సీ కోనుగోలు లాంటి సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంకు. ఈ మేరకు కస్టమర్లకు ఎస్ఎంఎస్ పంపింది హెచ్డీఎఫ్సీ.మరోవైపు ఐసీఐసీఐ కూడా ఐమొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవాలని కస్టమర్లను కోరింది.