ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers’ Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము.
ఈ రోజు శెలవుదినం కాదు.
ఉత్సవం జరుపుకొనవలసిన దినం.
పాఠశాలలు యధావిధిగా తెరిచి , ఉత్సవాలు జరుపుకుంటాము.
ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు.
పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు.
బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అనిర్వచనీయమైనది.
ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠమూ ఒక సూక్తి వంటిది.
అందుకే పాఠాలతోపాటు ఆయన బోధించే సారాంశం, పాఠాలతో ప్రత్యక్ష సంబంధం లేనిదైనా అది విద్యార్ధి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయుడి వాక్కుకు అంత శక్తి ఉంది. ఆ శక్తి అనంతమైనది.
విద్యార్ధి చివరి దశ వరకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్ధి …సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ.
అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.