సీఎం, మంత్రివర్గం ఇతర ప్రజా ప్రతినిధులకు మార్చి నెల వేతనం వాయిదా
అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం వాయిదా
మిగతా ఉద్యోగులకు 50 శాతం..
నాలుగవ తరగతి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం చెల్లింపు
పరిస్థితి కుదుట పడ్డాక మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టీకరణ
అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది.
మరో పక్క కోవిడ్–19 నియంత్రణతో పాటు ఇతర అత్యవసర వ్యయానికి నిధులు అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లోని వారికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు మార్చి నెల వేతనాలను చెల్లించకుండా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
– అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులందరి మార్చి వేతనాల్లో 40 శాతం చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.
– రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులకు మార్చి నెల వేతనాల్లో 50 శాతం చెల్లింపు, మిగతా 50 శాతం వాయిదా.
– నాలుగవ తరగతి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు చెల్లింపు.